A place where you need to follow for what happening in world cup

పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

- మోస్రాలో పీ.ఓల శిక్షణ తరగతులను సందర్శించిన అబ్జర్వర్.

0 59

పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి.                                                        – మోస్రాలో పీ.ఓల శిక్షణ తరగతులను సందర్శించిన అబ్జర్వర్.                తెలంగాణ ఫోకస్:ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉండే పోలింగ్ విధులను ప్రిసైడింగ్ అధికారులు(పీ.ఓలు) సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పీ.ఓ లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. సాలూర మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులకు మలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులను సందర్శించిన కలెక్టర్ పోలింగ్ విధులకు సంబంధించి కీలకమైన సూచనలు చేశారు. నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం కల్పించకూడదని సూచించారు. సమయ పాలనను పాటిస్తూ, సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. మొదటి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనున్న దృష్ట్యా, 10వ తేదీ ఉదయం 8.00 గంటల సమయానికే దిస్త్రిబ్యుషన్ సెంటర్లకు చేరుకుని, పోలింగ్ మెటీరియల్ ను తీసుకోవాలని అన్నారు. చెక్ లిస్టుకు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రి ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అనంతరం డిస్త్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ స్టేషన్ కు చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను చక్కబెట్టుకోవాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. సీటింగ్ అరేంజ్ మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఓటింగ్ విషయంలో గోప్యత నూటికి నూరు శాతం అమలు జరిగేలా చూడాలన్నారు. ఓటరు జాబితాను అనుసరిస్తూ ఓటర్లను నిర్ధారించి, వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించాలని అన్నారు. ఓటరు ఐ.డీ, ఆధార్ కార్డులే కాకుండా ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటరు ఓటు వేయవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి బ్యాలెట్ పత్రం పొందిన ఓటరు తప్పనిసరిగా ఆ పత్రాన్ని బ్యాలెట్ బాక్సులో వేసి ఓటు హక్కు వినియోగించుకునేలా నిశిత పరిశీలన చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క బ్యాలెట్ పత్రం కూడా బయటకు వెళ్లకూడదని కలెక్టర్ జాగ్రత్తలు సూచించారు. టెండర్ ఓటుకు ఆస్కారం లేకుండా పక్కాగా పరిశీలన జరపాలని సూచించారు. స్టేజ్-2 అధికారులు మినహా మిగతా మరెవరి వద్ద కూడా సెల్ ఫోన్లు ఉండకూడదని, పోలింగ్ కేంద్రం బయట సెల్ ఫోన్లను తీసుకుని భద్రపర్చేలా కౌంటర్ ఏర్పాటు చేయించాలని అన్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లేందుకు అనుమతించాలని అన్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను ప్రతీ పీఓ క్షుణ్ణంగా చదివి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, పోలింగ్ విధుల సందర్భంగా అన్ని నిబంధనలను పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను యధాతథంగా అమలు చేయాలే తప్ప, సొంత నిర్ణయాలకు తావు కల్పించకూడదని హితవు పలికారు. ఎన్నికల విధులలో అనవసర పొరపాట్లకు ఆస్కారం కల్పిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా జరిగి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా పూర్తయ్యేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని పీ.ఓలకు సూచించారు. కాగా, పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు వివరాల ప్రకటనలో తొందరపాటు ప్రదర్శించకూడదని, పక్కాగా నిర్ధారణ చేసుకున్న తరువాతనే ఓటింగ్ శాతాన్ని, కౌంటింగ్ వివరాలను వెల్లడించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ లు నెలకొల్పి ఓటర్లకు సహాయపడేలా బీ.ఎల్.ఓలను అందుబాటులో ఉంచాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఇదిలాఉండగా, మోస్రా మండల కేంద్రంలో పీ.ఓలకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్ పాల్గొని సూచనలు చేశారు. శిక్షణ తరగతుల్లో స్థానిక అధికారులు, స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!