తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు…
డబ్బులు ఇస్తేనే కదులుతున్న భూభారతి ఫైల్స్…
జూనియర్ అసిస్టెంట్ పెత్తనం ప్రజల ఫైల్స్ పెండింగ్లోనే!…
లోకల్ ఫైల్స్కే ప్రాధాన్యం సాధారణ ప్రజలు కార్యాలయం చుట్టూ చక్కర్లు…
నూతన ఎమ్మార్వో ముందే కార్యాలయంలో పాత వ్యవస్థ…
అన్నీ తానై వ్యవహరిస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్…
తెలంగాణ ఫోకస్ న్యూస్ ఫిబ్రవరి24: నందిపేట్ తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఫైల్స్ కదలాలంటే డబ్బులు తప్పనిసరేనని ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మార్వోను అలుసుగా తీసుకుంటూ, కార్యాలయంలోని ఒక లోకల్ జూనియర్ అసిస్టెంట్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూభారతి సంబంధిత ఫైల్స్ నెలల తరబడి పెండింగ్లో ఉంచి, డబ్బులు ఇస్తేనే ముందుకు కదిలిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఫైల్ స్థితి గురించి అడిగితే స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, మధ్యవర్తుల ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు…
కార్యాలయం సిబ్బంది పై పెత్తనం…
తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది వ్యవహార శైలి పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన కార్యాలయం కొంతమంది ఉద్యోగుల పెత్తనానికి కేంద్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలోని కొంతమంది జూనియర్ అసిస్టెంట్లు సిబ్బంది పై పెత్తనం చెలాయిస్తూ, తమకు అనుకూలమైన లోకల్ ఫైల్స్ను మాత్రమే వేగంగా పూర్తి చేస్తూ, ఇతరుల ఫైల్స్ను కావాలనే పెండింగ్లో ఉంచుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేదా పరిచయాలు ఉంటేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలు రోజులు తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, కార్యాలయ పనితీరుపై విచారణ జరిపి పారదర్శకంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఏళ్ల తరబడి ఒకే కార్యాలయంలో అధికారులు…
ప్రజలకు సేవలు అందించాల్సిన నందిపేట్ తహసీల్దార్ కార్యాలయంలో కొంతమంది లోకల్ అధికారులు ఏళ్ల తరబడి ఒకే చోట కొనసాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదే పదే బదిలీలు జరుగుతున్నా, కొందరు మాత్రం అదే కార్యాలయంలో కొనసాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. దీని వల్ల కార్యాలయంలో తమదైన ప్రభావం పెంచుకుని, ఫైల్స్ వ్యవహారంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..