తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్….
ప్రజలను గజగజ వణికించిన తీవ్రమైన చలి ఒక్కసారిగా తగ్గిపోయిందని వాతావరణ శాఖ వెల్లడి..
తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్….
తెలంగాణ ఫోకస్ న్యూస్ సబ్ ఎడిటర్ (బి నరేష్..) జనవరి 15:
తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. ఇక వాతావరణం మామూలే !!
తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ ప్రకటించింది. గత నెల రోజులుగా ప్రజలను గజగజ వణికించిన తీవ్రమైన చలి ఒక్కసారిగా తగ్గిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
సాధారణంగా మహాశివరాత్రి వరకు కొనసాగాల్సిన చలికాలం.. ఈసారి సంక్రాంతికి ముందే వీడ్కోలు పలకడం విశేషంగా మారింది. ఈ క్రమంలోనే తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో ఇంకా మంచు కురుస్తున్నా.. పగటిపూట మాత్రం ఎండ తీవ్రత పెరుగుతోందని భావిస్తున్నారు.
*ముగిసిన “కోల్డ్ వేవ్ 2.0”..*
కాగా కొన్ని రోజుల క్రితం వరకు ఎముకలు కొరికిన చలిగాలుల స్థానంలో ఇప్పుడు వెచ్చని గాలులు వీస్తున్నాయి. నేడు, రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీల వరకు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల కొనసాగిన రెండో దశ చలిగాలులు (Cold Wave 2.0) అధికారికంగా ముగిసినట్లు వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. రానున్న పది రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉండనున్నాయని, తీవ్రమైన చలి తిరిగి వచ్చే అవకాశాలు లేవని తెలిపారు.
ఇక హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగనుంది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల మధ్యాహ్న సమయాల్లో ఎండ ప్రభావం మరింత ఎక్కువగా అనిపించే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు పెరుగుతున్నప్పటికీ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం వాతావరణం కొంత భిన్నంగా ఉండనుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో మేఘావృత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అలానే సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోని బీదర్ సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ అకస్మాత్తు వాతావరణ మార్పులతో పంట పొలాల్లో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చలి తగ్గి, ఎండలు పెరగడం వల్ల కొన్ని పంటలకు లాభం చేకూరే అవకాశం ఉన్నప్పటికీ, అకాల వర్షాలు పడితే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి, కూరగాయ పంటలపై రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
అంతే కాకుండా వాతావరణంలో వస్తున్న ఈ ఆకస్మిక మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పగటిపూట ఎండ, రాత్రిపూట స్వల్ప చలి ఉండటం వల్ల జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అదనపు జాగ్రత్తలు పాటించాలి. తగినంత నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
సాధారణంగా సంక్రాంతి పండుగ సమయంలో చల్లటి గాలులు వీస్తూ గాలిపటాలు ఎగరవేయడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఈసారి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పండుగ సమయంలో ఎండ వేడిమి కొంత ఇబ్బంది కలిగించే అవకాశముంది. అయినప్పటికీ వర్ష సూచనలు పెద్దగా లేకపోవడంతో సంక్రాంతి సంబరాలకు ఎటువంటి అంతరాయం కలగదని ప్రజలు భావిస్తున్నారు. మొత్తం మీద, ఈసారి సంక్రాంతి పండుగ చలికన్నా ఎండతోనే జరగనుంది.